Adiparvam-part1 Adiparvam-part1 Adiparvam-part1 Adiparvam-part1
Adiparvam-part1 Adiparvam-part1 Adiparvam-part1 Adiparvam-part1
శ్రీమదాంధ్ర మహా భారతము
(తేట తెలుగు వచనం లో)
సంస్కృత మూలం భగవాన్ వేదవ్యాసమహర్షి.
తెలుగు మూలం శ్రీ నన్నయ భట్టారకుడు, శ్రీ ఎట్టా ప్రగడ, శ్రీ తిక్కన సోమయాజి.
(కవిత్రయం ).
తేట తెలుగువచనం లో మీ కందిస్తున్నది
కవిత్రయం పాదరేణువు
మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. (రిటైర్డు హైకోర్టు రిజిష్టార్)
2–31, సత్యనారాయణపురం, చైతన్యపురి కాలనీ, హైదరాబాద్ 500060
ఫోన్: 24048104. (సెల్: 9391134792).
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
శుక్లామ్బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం| ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే||
వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం! పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః|| అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వ జిష్ణవే|| యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ |
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే||
మంగళ శ్లోకం
శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాథేషు యే| లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం!
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజిత వస్సురై/ ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవ శ్రీకన్దరా శ్రేయ..!!
శ్రీమదాంధ్ర మహా భారతము
ఆది పర్వము
ప్రథమాశ్వాసము.
విమలాదిత్యుని కుమారుడు రాజరాజనరేంద్రుడు రాజమహేంద్ర వరమును రాజధానిగా చేసుకొని వేంగీ రాజ్యమును పరిపాలిస్తున్నాడు. రాజరాజనరేంద్రుని ఆస్థానంలో ఆపస్తంభ సూత్రుడు, ముద్గల గోత్రంలో
పుట్టినవాడు, సుజనుడు అయిన నన్నయ భట్టారకుడు ఆస్థాన కవీంద్రుడుగా ఉండేవాడు.
ఒకరోజు రాజరాజనరేంద్రుడు నన్నయభట్టును చూచి ఈ విధంగా అన్నాడు. “మహానుభావా! మీరు చెప్పిటువంటి పురాణములు ఎన్నో విన్నాను. అర్థశాస్త్రముల గురించి తెలుసుకున్నాను. ఉదాత్త రసంతో కూడిన కావ్యములు నాటకములు ఎన్నో చూచాను. నా మనసంతా భక్తితో నిండిపోయింది. కాని ఎన్ని విన్నా మహాభారతము విన్నదానితో సాటి రాలేదు. నా మనసు మహాభారత కావ్యము మీదనే లగ్నమయింది. నాకు ఎప్పుడూ మహాభారతము వినవలెనని కుతూహలముగా ఉంటుంది. ఎందుకంటే మా పూర్వులైన పాండవుల చరిత్ర
తెలుసుకోడం నాకు ఎంతో ప్రీతి పాత్రమైనది. కాని మహాభారతము సంస్కృ తములో ఉంది. దానిని దయచేసి తెలుగులో రాయండి.” అని అర్థించాడు రాజరాజనరేంద్రుడు.
“మహారాజా! మహాభారతమును తెలుగులో రాయడమంటే ఆకాశంలో చుక్కలు లెక్కబెట్టడం లాంటిది. నా వల్ల అవుతుందా అని సందేహంగా ఉంది.
అయినా తమరు ఆజ్ఞాపించారు కాబట్టి ప్రయత్నిస్తాను.” అని పలికాడు నన్నయభట్టు.
త్రిమూర్తులను, గణపతిని, కుమారస్వామిని, లక్ష్మి,సరస్వతి, పార్వతులను, సమస్త దేవతలను మనసులో తల్చుకున్నాడు. వారికి నమస్కారం చేసాడు. ఆది కవి వాల్మీకికి, పరాశరుని కుమారుడైన వేదవ్యాసునికి మనసులోనే నమస్కారం చేసాడు. తన కంటే ముందు ఉన్న అందరు కవులకు నమస్కరించాడు. తన సహపాఠి అయిన నారాయణభట్టు సాయం తీసుకున్నాడు. ఆ ప్రకారంగా నన్నయభట్టు మహాభారతమును తెలుగులో రచించడానికి ఉద్యుక్తుడైనాడు.
ఈ మహాభారత కధాక్రమము ఎలాంటిది అంటే.............
నైమిశారణ్యంలో శౌనకుడు అనే కులపతి ఉన్నాడు. ఆయన లోక హితం కోసరము 12 సంవత్సరములు నడిచేసత్రయాగము చేయడానికి
సంకల్పించాడు. ఆ సమయంలో రోమహర్షుణుని కుమారుడు అయిన ఉగ్రశ్రవసుడు అనే సూతుడు–(పురాణ కధలు చెప్పేవాడు) వచ్చాడు. అక్కడ ఉన్న మహామునులకు నమస్కరించాడు. శౌనకాది మహామునులందరూ ఆ సూతుని వలన పురాణ కధలు వినవలెనని ఉత్సాహంగా ఉన్నారు. ఆ మునులను చూచి ఆ సూతి ఇలా అన్నాడు.
“అయ్యా! నేను వ్యాసుని శిష్యుడైన
రోమహర్షణుని కుమారుడను, ఉగ్రశ్రవసుడు అనే పేరుగల సూతుడను. నేను అనేక పురాణ గాధలు చెప్పగలను. నా వలన మీరు ఏ పురాణ గాధ వినవలెనని కుతూహల పడుతున్నారో తెలపండి.” అని అడిగాడు.
ఆ మాటలకు మునులు ఇలా అన్నారు. “ఏది వింటే మాకు అన్ని విషయాలు తెలుస్తాయో, ఏ కధ హృద్యంగా ఉంటుందో, ఏ కధ వింటే పాపాలు తొలగిపోతాయో ఆ కధమాకు వినిపించండి.” అని అడిగారు. అప్పుడు సూతుడు మహాభారత కధను చెప్పడం ప్రారంభించాడు.
పూర్వము వేదములన్ని ఒకటిగా ఉండేవి. వాటిని వ్యాసుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని విభజించాడు. తరువాత తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు సుమంతుడు, జైనుడు అనే వారలను నియమించి చతుర్వేదములకు సూత్రాలు రాయించాడు. దాని వలన వ్యాసుడు
వేదవ్యాసుడు అని ప్రసిద్ధి చెందాడు.
తరువాత వేదవ్యాసుడు బ్రహ్మచేత ఆజ్ఞాపించబడి, అష్టాదశ (18)పురాణములను, నీతి శాస్త్రము, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, తత్త్వశాస్త్రములను, వేదములు, వేదాంతములు (అనగా ఉపనిషత్తులు) వాటి మీద వ్యాఖ్యానములను, ధర్మార్థకామమోక్షములు, అరిషడ్వర్గములు వాటికి సంబంధించిన విషయములో కూడిన కధలను, నాలుగు యుగములలో ఉన్న రాజుల వంశముల చరిత్రలను, నాలుగు వర్ణములు, నాలుగు ఆశ్రమ ధర్మములు వాటి క్రమములను, ఎల్ల దేవతలతో పూజింపబడే శ్రీకృష్ణుని
మాహాత్మ్యమును, పాండవులు మొదలగు భారతవీరుల మహాగుణములను,
క్రోడీకరించి, తన యొక్క విమలమైన
జ్ఞానము, వాక్కులు ప్రకాశిస్తూ ఉండగా, సంస్కృతంలో మహా భారతము అనే మహా గ్రంధమును రచించాడు.