హాహాకారాలుచేస్తున్నారు. అందరూ కలిసి మునుల దగ్గరకు వెళ్లారు. వారు
అందరూ కలిసి దేవతల దగ్గరకు వెళ్లారు. అందరూ కూడపల్కుకొని
బ్రహ్మదేవుని వద్దకు పోయారు. విషయమంతా తెలుసుకున్న బ్రహ్మ అగ్ని దేవుని పిలిపించాడు.
“ఓ అగ్నీ! వ్యక్తమవుతున్న (కనిపించుచున్న) ఈ సమస్త భూతకోటికి నీవు యజమానివి. ఈ చరాచర సృష్టికి నీవు హేతుభూతుడవు. సమస్త దేవతలకు ముఖం లాంటి వాడివి. లోకపావకుడవు. అలాంటి నీవు ఇలా చెయ్యడం భావ్యమా! భృగుమహర్షి వాక్కు అమోఘము. ఆ ముని వాక్కు
ప్రకారము నీవు సర్వభక్షకుడివి అయినా నీకు అశౌచము ఎలా కలుగుతుంది. నీవు శుచులలో శుచుడివి. నీ వలన సర్వమూ పవిత్రము అవుతుంది. పూజింప తగిన వారిలో నీవు అగ్రపూజ్యుడివి. కాబట్టి నీ విధులు యధావిధిగా నిర్వర్తించు. బ్రాహ్మణుల సాయంతో హవిస్సులను దేవతలకు అందించు.” అని
అన్నాడు బ్రహ్మ దేవుడు.
అగ్నిదేవుడు బ్రహ్మదేవుని మాటలను ఆమోదించాడు. అగ్ని కార్యములు యధావిధిగా జరుగుతున్నాయి. తరువాత, భృగు కుమారుడైన చ్యవనుడు సుకన్య అనే కన్యను వివాహమాడాడు. వారికి ప్రమతి అనే కుమారుడు కలిగాడు. క్షీరసాగర మధన సమయంలో అమృత కలశంతో పాటు ఘృతాచి అనే అప్సరస కూడా పుట్టింది. ఆ ఘృతాచిని ప్రమతి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇరువురికి రురుడు అనే కుమారుడు జన్మించాడు.
ఇది ఇలా ఉండగా, విశ్వావసుడు అనే గంధర్వరాజుకు, మేనక అనే అప్సరసకు ప్రమద్వర అనే కుమార్తె పుట్టింది. ఆ ప్రమద్వర స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతూ ఉంది. ఆ ప్రమద్వరను ఈ రురుడు
ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.
ఇంతలో ఒకరోజు ఆ ప్రమద్వరను ఒక పాము కాటు వేసింది. పాము కాటుతో ప్రమద్వర మరణించింది. ఆ ముని ఆశ్రమంలో ఉన్న వారందరూ
ఆమె మరణానికి దుఃఖించారు. ఈ వార్త విన్న రురుడు గుండె బద్దలు అయ్యేట్టు ఏడ్చాడు. అక్కడ ఉండలేక ఒంటరిగా అడవులలోకి వెళ్లిపోయాడు. ఒక చోట కూర్చుని చేతులు పైకెత్తి “ఓ దేవతలారా! ఓ బ్రాహ్మణులారా! నేను దేవ
యజ్ఞములు, వేదాధ్యయనము, వ్రతములు, పుణ్యకార్యములు చేసిన వాడిని అయితే, నేను నా గురువులను భక్తితో సేవించేవాడిని అయితే, నేను ఘోరమైన తపస్సు చేసేవాడిని అయితే, నా మనస్సునిండా నిల్చిన నా ప్రేయసి
ప్రమద్వరకు మీ అందరి దయవలన విషము దిగిపోవుగాక!” అని ప్రార్థించాడు. “ఈ లోకంలో ఎంతో మంది మంత్ర తంత్రములు నేర్చినవారు. విషతత్త్వ శాస్త్రములు చదివిన వారు ఉన్నారు కదా! ఒక్కరు కూడా ప్రమద్వర ను ఈ విషము నుండి కాపాడలేరా! అలా చేస్తే నేను ఇప్పటి వరకూ చేసిన తపోఫలము, అధ్యయన ఫలము వారికి ధారపోస్తాను.” అని ఆ క్రోశించాడు.
అతని మొరను విని ఒక దేవదూత ఆకాశమునుండి ఇలా పలికాడు. “ఓ విప్రోత్తమా! ప్రమద్వరను కాలవశమున పాము కాటు వేసింది. దానిని ఆపడం ఎవరి తరమూ కాదు. కాని దీనికి ఒక ఉపాయము మాత్రం ఉంది. ఎవరైనా తమ ఆయుర్దాయములో సగం ఆమెకు ఇస్తే ఆమె విషం నుండి విముక్తి
పొందుతుంది. ఇదివరకటి కంటే ఎక్కువ తేజస్సుతో జీవిస్తుంది. ఇది
యమధర్మరాజు అనుమతితో నేను చెబుతున్నాను.” అని అన్నాడు. రురుడు సంతోషంతో తన ఆయువులో సగభాగం ప్రమద్వరకు ఇచ్చాడు. ప్రమద్వర విషము నుండి విముక్తి పొందింది. రురుడు, ప్రమద్వర పెళ్లి చేసుకొని సుఖంగా
ఉన్నారు.
కాని రురుడికి మాత్రం తన ప్రేయసికి అపకారం చేసిన పాముల మీద
కోపం పోలేదు. ఒక కర్ర తీసుకున్నాడు. కనిపించిన పామును కనిపించినట్టు
చంపుతున్నాడు. చెట్ల వెంట పుట్టల వెంట తిరుగుతూ, పాములను వెతికి వెతికి మరీ చంపుతున్నాడు. అలా చంపుతుండగా ఒక రోజు డుండుభము అనే పామును చూచాడు. చిక్కిందిరా అని దానిని చంపడానికి కర్రపైకి ఎత్తాడు. ఆ డుండుభము అనే పాము భయపడి అతనితో ఇలా అంది.
“ఏంటిది? పాములను ఎందుకు చంపుతున్నావు? దీనికి కారణమేమి? నీవు మంచి తేజస్సుగల బ్రాహ్మణుడి లాగా కనపడుతున్నావు. ఈ పాములను చంపడం ఏమిటి?” అని అడిగింది.
“ నా పేరు రురుడు. నేను ప్రమద్వర అనే కన్యను ప్రేమించాను. ఒక పాము నేను ప్రాణంతో సమానంగా ప్రేమించిన నా ప్రేయసిని కాటు వేసింది. అందుకే పాములను చంపుతున్నాను. నిన్నుకూడా ఇప్పుడే చంపుతాను” అని కొట్టడానికి కర్రను పైకి ఎత్తాడు.
వెంటనే ఆ పాము మానవ ఆకృతి దాల్చి రురుడి ఎదురుగా నిలబడింది. రురుడు ఆశ్చర్యపోయాడు. “ఇదేమిటి! నీవు పామువు కదా! మునీశ్వర అవతారం ఎత్తావేమిటి? నీవు ఎవరు?” అని అడిగాడు.
“అయ్యా! నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుడను. నా స్నేహితుని పేరు ఖగముడు. ఒక రోజు ఖగముడు అగ్నికార్యము చేస్తున్నాడు. నేను పరిహాసానికి ఒక గడ్డితో చేసిన పామును అతని మీదికి విసిరాను. దానికి అతనికి కోపం వచ్చింది. నన్ను విషం లేని పాముగా మారిపొమ్మని శపించాడు. ఏదో పరిహాసానికి
చేసిన పనికి అంతఘోరమైన శాపం పెడతావా! నన్ను క్షమించలేవా అని అడిగాను. మిత్రమా! నా మాట తప్పకుండా జరుగుతుంది. కానీ నీవు పాముగ